ఉగ్రతారాదేవి ఆలయం వున్న ప్రదేశం :
గౌహతినగరంలోని తూర్పుభాగంలోగల ఉజాన్ బజార్ అనే ప్రాంతంలో అమ్మవారి ఆలయం నెలకొనివుంది.
కాళికాపురాణంనందు దిక్కరవాసినీ శక్తిపీఠంగా ఈ అమ్మ వర్ణించబడివుంది. ఈ పురాణం ప్రకారం దిక్కరవాసినికి రెండు రూపాంతరాలున్నాయి. ఒకటి తీక్ష్ణకాంత కాగా, మరొకటి లలితకాంత. తీక్ష్ణకాంత నల్లనిమేనిఛాయలో, పెద్దబానలాంటి పొట్టని కలిగివుంటుంది. ఈ రూపంలో ఆమెని ఉగ్రతార లేక ఏకజట అనికూడా పిలుస్తారు. లలితకాంత సౌమ్యమైన రూపంతో, అత్యంత ఆకర్షణీయంగా వుంటుంది. ఈమెను తామ్రేశ్వరీ అనికూడా పిలుస్తారు.
| First | Previous | Next |
స్థలపురాణం :
పూర్వం ఒకానొకప్పుడు నరకాధిపతియైన యమధర్మరాజు కామరూప దేశం నుండి ఏ ఒక్కపాపి కూడా తన పాపకర్మల ఫలితంగా నరకానికి రాకుండా పోవటాన్ని గమనించాడు. వారు కేవలం ఈ పుణ్యప్రదేశనివాస ఫలితంగానే సరాసరి పరమపదమైన దేవీస్థానాన్ని పొందుతున్నారని గ్రహించాడు. సమవర్తియైన ఆయన ఈవిషయాన్ని బ్రహ్మదేవునికి నివేదించాడు. ఈ సమస్యను ఎటూతేల్చలేక, బ్రహ్మదేవుడు ఆ యమధర్మరాజుని వెంటబెట్టుకొని వైకుంఠధామం చేరాడు. అక్కడ దేవదేవుడైన శ్రీహరిని దర్శించి, ఆయనకు సమస్యని విన్నవించాడు. ఆయన చిరుదరహాసంతో "ఈ సమస్యను సనాతనుడు, సర్వసాధనారహస్యసారాన్ని ఎరిగినవాడు అయిన మహాదేవుడే తీర్చగలడు" అని తెలిపి, వారిని ఆశీర్వదించి కైలాసానికి పంపించాడు. అక్కడ భోళాశంకరుడు వారిద్వారా విషయాన్ని గ్రహించి, వెంటనే ఉగ్రతారాదేవిని పిలిపించాడు. మహోగ్రరూపంలో తరలివచ్చిన ఆమెతో ఆ స్వామి నీ సైన్యంతోసహా కామాఖ్య పైకి వెళ్ళి, అక్కడ నివసించే ప్రజలందరిని తరిమికొట్టమని ఆదేశించాడు. ఆమె తనపరివారంతో కామాఖ్య ప్రవేశించి ఆ పుణ్యధామంలో నివసించేవారినందరిని తరిమికొట్టసాగింది. ఆ సమయంలో వశిష్ఠమహర్షి సంధ్యాచలంపై పరమశివుని కోసం తపస్సుచేస్తూ వున్నాడు. అప్పుడు ఆ ఉగ్రతారాదేవి అయన్నికూడా మిగిలినవారిలాగే భావించి వెళ్ళగొట్టబోయింది. దానితో మహాతపశ్శక్తి సంపన్నుడైన వశిష్ఠమహర్షి క్రోధితుడై ఉగ్రతారాదేవిని, ఇంకా ఇటువంటి పనికి పురిగొల్పిన మహాదేవుణ్ణి కూడా శపించాడు. ఆ శాపకారణంగా అప్పటి నుండి కామరూపదేశంలో వేదోపాసన (శివోపాసన) అంతరించి పోవటమే కాకుండా, ఉగ్రతారాదేవి వామాచార దేవతగా విలసిల్లసాగింది. ఆమె పరివారమంతా వేదబాహ్యులై , మ్లేచ్ఛులై సంచరించసాగారు.
ఉగ్రతారా సాధన :
ఉగ్రతారాదేవిని కూడా కామాఖ్యదేవి యొక్క పూజావిధిననుసరించే పూజిస్తారు. ఆమెకి ప్రీతిపాత్రమైన మద్యం, మాంసం, మోదకం, కొబ్బరికాయ మరియు చెరకుగడల్ని ఉగ్రతార పూజలో కూడా వినియోగిస్తారు.
తామ్రేశ్వరి :
అస్సాంలోగల తూర్పు లకింపూర్ జిల్లాలోని సాడియా అనే గ్రామంలో తామ్రేశ్వరి దేవి ఆలయం నెలకొనివుంది. పూర్వకాలంలో ఈ అమ్మప్రీతి కోసం మనుషులని బలిగా సమర్పించేవారు. దానివల్ల ఈమెను "కేశాయ్ ఖాటి" అనికూడా పిలుస్తారు.
Reference article : shakti-peethas/topic26.html
