దీపావళి పండుగ ప్రతి సంవత్సరము అశ్వీజమాసము లో వచ్చే ముఖ్యమైన పండుగ.ఈ పండుగను ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.సాయం సమయం లొ ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు.పిల్లలంతా టపాసులు కాల్చి సంతొషపడుతుంటారు.ఆసలు ఈ పండుగను ఇంత సంతోషదాయకంగా ప్రజలు ఎందుకు జరుపుకుంటున్నారు తెలియాలంటే మనము కొన్ని కథలు తెలుసుకొవాలి.అందులో ముఖ్యమైన కథ నరకాసురుని మీద శ్రీకృష్ణుని విజయము.
అసలు ఇంతకీ ఈ నరకాసురుడు ఎవరు ?
పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భుమిని అనంత సముద్రజలాలోకి పడవేస్తాడు.అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరము ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు.ఆ సమయములొ వారికి ఒక పుత్రుడు కలుగుతాడు.ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలొ అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవి కి చెపుతాడు.ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది.దానికి విష్ణుముర్తి సరే అని , తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భుదేవి ఎంతో సంతోషిస్తుంది.తర్వాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్దులు నేర్పమని అడుగుతుంది.ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలొ పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు.
పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్య లొని అమ్మవారిని తల్లిలాగ భావిస్తు చక్కగా పూజచేసెవాడు.తన రాజ్యములొని ప్రజలందరిని ఎంతో చక్కగ పరిపాలించేవాడు.ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.తర్వాత ద్వాపరయుగములొ, అతనికి పక్క రాజ్యమైన శోణితపురము కు రాజైన బాణాసురునితో స్నేహము ఎర్పడుతుంది.బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడమును నిరసించేవాడు.అతని దృష్టిలొ స్త్రి ఒక భోగవస్తువు.అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ అపేవేసినాడు.ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు.ఆ విధముగా 16,0000 మంది రాకుమార్తెలను బంధించాడు.
శ్రీకృష్ణుడు నరకాసురిని మీదకు దండయాత్రకు వెళ్ళుట:
ఆ విధముగా అహంకరిచి ప్రవర్తిస్తున్న నరకసురుడు ఒక సారి స్వర్గము మీద దండయాత్ర చేసి దేవతల కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను,దేవమాతను అవమాన పరుస్తాడు.అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారము అయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని సంహరించమని ప్రార్ధిస్తారు.అదే సమయములొ భూదేవి సత్యభామ రూపములొ అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడి ఉంది.కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ కూడా గుర్తులేవు.ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది.దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు.అక్కడ వారు విడిది చేసిన ప్రాంతాన్ని అశ్వక్రాంత అని పిలుస్తారు.అప్పుడు శ్రీక్రిష్ణుని కి నరకాసురునికి మధ్య ఘోర యుధ్ధము జరౌగుతుంది.కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావము వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు.అందువలన శ్రీకృష్ణుడు యుధ్ధమధ్యలో మూర్చపొయినట్లు నటిస్తాడు.కళ్ళముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణము వేస్తుంది.ఆ బాణము దెబ్బకు నరకాసురుడు చనిపోతాడు.ఆ విధముగా నరకాసురుడు తన తల్లి చేతులలోనే మరణిస్తాడు.ఈ విధముగా నరకాసురుని సంహరం జరుగుతుంది.అప్పుడు 16,000 మంది రాకుమర్తెలు మమ్మలనందరిని నీవే వివాహమాడమని ప్రార్ధిస్తారు.దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడతాడు.
నరకచతుర్దశి, దీపావళి:
ఆ విధముగా నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు.ఇది ప్రతి సంవత్సరము ఆశ్వీజమాసము కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది,ఆరోజు నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు.ఆ తరువాత రోజు , అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగగా జరుపుకుంటారు.ఆ రోజు ఉదయము అందరు కూడాఎంతో సంతోషముగా స్వీట్లు పంచుకుంటారు.సాయంత్రము ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు.దీపాలు వెలిగించి చీకట్లను ప్రారదోలతారు.జీవితాలలో క్రొత్తవెలుగులు వస్తాయని భావిస్తారు.
ఈ పండుగను భారతదేశమంతా జరుపుకుంటుంది.ఈ పడుగ రోజు సాయంత్రము లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు.అమ్మవారి అనుగ్రహముతో తర్వాత సంవత్సరము అంతా శుభంగా ఉంటుంది అని భావిస్తారు.
